Tuesday, December 31, 2013

సీమ భవితవ్యంపై నీలినీడలు - లెక్కల వెంకటరెడ్డి

రాష్ట్ర విభజన అంశం శరవేగంతో దూకుసువెళ్తూ చరమాంకంలో ప్రవేశించింది. జిఓఎం (గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌) పలు దఫాలుగా వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు సూచనలు సేకరించి తనదైన శైలిలో విభజన బిల్లు ముసాయిదాను రూపొందించింది. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాలతో అది పార్లమెంటుకు చేరి ఆమోదం పొందడంతో చట్టరూపం దాల్చనుంది. ఈ నేపథ్యంలో జి.ఓ.ఎం. కాని దాని ముందటి ఆంటోని కమిటీ గాని విభజన అంశాలపై విస్తృత చర్చలు జరిపినట్లు చెప్పుకున్నప్పటికీ అదంతా కాంగ్రెస్‌ అధినేత్రి కనుసన్నల్లోనే జరిగిందనేది తిరుగులేని వాస్తవం! బిల్లు రూపకల్పన గాని, ముసాయిదాపై జరిగిన ఉత్తుత్తి చర్చగాని అధినేత్రి అభీష్ఠం మేరకే సాగింది. ఈ విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే!నామ్‌కే వాస్తేగా జరిగిన ఈ విభజన బిల్లు మొత్తం వ్యవహారంలో రాయలసీమ గురించి ఎలాంటి చర్చ జరుగకుండా పోయింది. కనీసం దాని ఊసైనా చర్చల్లో రాకుండా పోవడమనేది రాయలసీమ వాసులకు మింగుడుపడని అంశం! ముసాయిదా చర్చల్లో నామమాత్రంగానైనా పాలుపంచుకున్న రాజకీయ శక్తులు, వ్యక్తులు రాయలసీమ అంశాన్ని ప్రస్తావించకపోవడం, ముసాయిదాగా మూలవిరాట్టు అయిన అధినేత్రి కూడా ఆ అంశాన్ని స్పృశించకపోవడాన్ని రాయలసీమ బిడ్డలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వివక్ష ధోరణి రాయలసీమ ఉనికికే ప్రమాదకరంగా పరిణమిస్తుందని వారు భావిస్తున్నారు. అంతేగాకుండా చాపక్రింద నీరులా సీమ భవిష్యత్తు పై నీలినీడలు కమ్ముకొస్తున్నాయనే దానికి ఇది ఒక సంకేతమని వారు తలుస్తున్నారు.
ఆంధ్ర రాష్ట్రం అవతరణ కాని, విశాలాంధ్ర ఆవిర్భావం కాని రాయలసీమ ప్రజల అనన్యసామాన్య త్యాగనిరతితోనే సాధ్యం అయింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సులభంగా జరుగలేదు. దాని వెనుక దశాబ్దాల ఉద్యమ పోరాటం ఉంది. రాయలసీమ వాసుల సహకారం లేనిదే ఆంధ్రోద్యమం ప్రారంభం కాలేదు. రాయలసీమ వాసుల విశ్వాసాన్ని చూరగొనేందుకు కోస్తాంధ్రులు ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్నీ పన్నారు. లెక్కకుమించి ఎత్తులు, ప్రయత్నాలు చేశారు. చివరకు వారికి ఇష్టంలేకపోయినా గత్యంతరం లేని పరిస్థితులలో శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకొనకతప్పలేదు. మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌ భవనంలో 1937 నవంబర్‌ 16న జరిగిన ఈ ఒడంబడిక అప్పుడూ -ఇప్పుడూ ఏనాడూ ఆవగింజంత కూడా అమలుకాలేదు. అయితే ఆనాటి ఆంధ్ర రాష్ట్రానికి రాయలసీమలోని చారిత్రక పట్టణం కర్నూలు రాజధాని కాగలిగింది. కోస్తాంధ్రుల తీవ్ర నిరసనల మధ్య రాజధాని నగరం కాగలిగిన కర్నూలు దాన్ని మూన్నాళ్ళముచ్చటగా మూడేళ్ళ వరకే పొందగలిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావంతో దాన్ని హైదరాబాద్‌ తన్నుకుపోయింది. ఈ మూన్నాళ్ళ ముచ్చటైన రాజధాని హోదా తప్ప శ్రీబాగ్‌ ఒడంబడిక ద్వారా రాయలసీమ ఇతర ఎలాంటి ప్రయోజనం పొందలేదు. కాగా సాగునీటి విషయంలో అయితే ఒప్పందం ఘోరంగా ఉల్లంఘించబడింది. ఈ ఒప్పందంలోని అంశాలలో సగమైనా అమలై ఉంటే రాయలసీమ ఇంతటి ఘోర వెనుకబాటుతనానికి గురై ఉండేదికాదు.
శ్రీబాగ్‌ ఒప్పందాన్ని ప్రస్తావించడం నాటి ఆంధ్ర రాష్ట్రం అవతరణలో అప్పటి తరం రాయలసీమ నేతల గణనీయ పాత్రను, వారి త్యాగశీల ఉదార స్వభావాన్ని గుర్తు చేయడానికే! కొన్ని ప్రధానమైన నిర్ణయాలలో సీమ ప్రజలు ద్వితీయశ్రేణి పేరిటగా పరిగణించబడ్డారు కూడా! ఆంధ్ర అనే పదం దానికి కోస్తా నాయకులు అర్థం పర్థం లేని వాదనలు లేవదీసి ప్రాథమిక దశలోనే దాన్ని త్రోసిపుచ్చారు. అయినా ఆంధ్ర రాష్ట్ర సాధనకు రాయలసీమ వాసులు మనస్ఫూర్తిగా సహకరించారు. అందుకు శ్రీబాగ్‌ ఒడంబడిక కంటే తెలుగు ప్రజల ఐక్యతా ఆకాంక్ష ప్రధాన కారణమై నిలిచింది. రాష్ట్ర విభజన అంశం బలంగా రూపుదిద్దుకొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సీమవాసులు సమైక్య ఉద్యమంలో చురుకైన పాత్రనే పోషించారు. గత ఆగస్టు నుండి మహోగ్రంగా సాగిన సమైక్య ఉద్యమం కోస్తాలో కంటే రాయలసీమలోనే ఉధృతంగా సాగిందనేది కాదనలేని వాస్తవం. ఇందుకు పత్రికల కథనాలు. టీవీ ఛానెళ్ళ ప్రసారాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. సమైక్యంలో సీమకు ఎలాంటి ప్రయోజనం కలుగకపోయినా విడిపోతే కోస్తాంధ్రుల కుట్రలకు మరింత బలికావాల్సి ఉంటుందనేది సీమవాసుల అభిప్రాయం! అందుకు ఆంధ్ర రాష్ట్రంలోని అనుభవాలే వారిని ఆలోచింపచేస్తున్నాయి. అంతేగాకుండా ఒక ఉదాత్త భావజాలంతో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ చీలికకు గురై భావోద్వేగ అనుభూతులను అదృశ్యం చేసుకోకూడదనే తపన కూడా ఒక ప్రధాన కారణం! విభజన చర్చలు ఊపందుకొని నెలల తరబడి చర్చలు జరిగిన సందర్భంలో విడిపోయే పక్షంలో రాయలసీమ విషయం ఏమిటనేది చర్చల్లో పొరపాటున కూడారాలేదు. ఆ మార్గంలో ఆంటోని కమిటీ గాని, జిఓయం గాని చర్చలకే అవకాశమివ్వలేదు. అసలు రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో తెలంగాణా, కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ ఒకటున్నదనే స్పృహే కలుగలేదు. సీమాంధ్రలో దాన్ని మిళితం చేసి రాయలసీమ ప్రాంతాన్నే తెరమరుగుచేశారు. చాలామంది రాయలసీమ ప్రజాప్రతినిధులు కేంద్రానికి, కోస్తాంధ్రులకు ఊడిగం చేసేందుకే సిద్ధపడ్డారు తప్ప శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో రాయలసీమ వెనుకబాటును గుర్తించలేదు. విడిపోతున్న భాగానికి తెలంగాణా మిగిలిన భాగానికి సీమాంధ్రగా ఇప్పటికే నామకరణం వారికి వారే చేసుకున్నారు. సీమాంధ్ర స్థానంలో రాయలసీమ నేతలు గతంలో సూచించిన విధంగా రాయలాంధ్ర పేరును సూత్రప్రాయంగా నైనా ఎత్తకపోవడం కోస్తావారి కుత్సితబుద్ధికి నిదర్శనం కాక మరేమిటి పైగా సీమాంధ్ర అనే పేరుకు రాయలసీమ పేరులోని ఆఖరు పదాన్ని తీసుకొని ఆంధ్ర పదానికి ముందు కలిపామని ఒక వికృత వివరణ అదే నిజమని అనుకుంటే కోనసీమ, దివిసీమ లాంటి కోస్తా ప్రాంతాలలోని ఆఖరు పదం మాటేమిటి ఆంటోని కమిటీ ముందు గాని, జిఓఎం ముందుగాని రాజకీయ పార్టీలు చేసిన సూచనలు, సమర్పించిన నివేదికల్లో రాయలసీమ ఊసే కనిపించదు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు విభిన్న ప్రాంతాలలో రాయలసీమ ఒకటి అనే విషయం కూడా ప్రస్తావనకు రాలేదు. ఎంతసేపూ ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాలదే చర్చ, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో, అది ఆంధ్రప్రదేశ్‌గా రూపాంతరం చెందే దశలో రాయలసీమ అవసరం ఎంతో కన్పించింది. రాయలసీమ నిరంతరం చర్చల్లో ఉండేది. వారి త్యాగాలకు గాలంవేసి రాయలసీమ నేతలను ఆపద్భాంధవులుగా చూసుకున్నారు. ఆ అవసరం ఎప్పుడో తీరిపోయింది. ఇప్పుడా అవసరం ఎటుచూసినా కన్పించడంలేదు. అందుకే రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణలో రాయలసీమను, సీమవాసులను కరివేపాకుగా మార్చారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోలవరం, భద్రాచలంపై జరిగిన మొత్తం చర్చలో రాయలసీమ పై ఆవగింజంత కూడా చర్చ రాకపోవడం అసంబద్ధమైన పరిణామం! రాయలసీమ అస్థిత్వాన్ని, చరిత్రను ధ్వంసం చేసే విధంగా భారీ స్థాయిలో క్యాబినెట్‌ సమావేశం వరకు తీసుకుపోయిన రాయలసీమ ప్రతిపాదనలోని రాయల పద ధ్వనిని భరించడం రాయలసీమ వాసులకు గుండెలపై సమ్మెటపోటు లాంటిది. అంతకంటే నిలువునా అగ్నికి ఆహుతి కావడం వారికి ఎంతో సంతృప్తినిస్తుంది. విభజన తర్వాత మిగిలిన భూభాగానికి రాయలాంధ్రగా మార్పు చేయాలని ఆలోచించకపోవడం అవగాహన లోపం కాదు. రాజధాని ప్రాంత గుర్తింపుకు సం బంధించి ఇప్పటికీ వచ్చిన రెండు మూడు ప్రతిపాదనలలో సీమ ప్రాంతం లేకపోవడం యాధృచ్ఛికం కాదు. నాటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు నగరం సీమప్రాంతం లోనిదే అనే విషయం మరిచిపోయారా పోలవరానికి జాతీయ హోదా ప్రధానమైనప్పుడు సీమలోని సాగునీటిప్రాజెక్టులకు నీటి కేటాయింపు ప్రధానం కాదా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు 2013 లో రాయలసీమను భాగంగా పేర్కొనకపోవడమటుంచి కనీసం ప్రస్తావన కూడా లేకపోవటం రాయలసీమి చరిత్రను ప్రాంత వైశిష్ట్యాన్ని సీమ త్యాగనిరతిని సమాధిచేయటమే! రాయలసీమ భవిష్యత్తుకు ఏమాత్రం భరోసా యివ్వని రాష్ట్ర విభజన రాయలసీమకు శాపగ్రస్తమే! విభజన అనివార్యంగా కనిపిస్తోన్న ఈస్థితి రాయలసీమ భవిష్యత్తుపై తీవ్రప్రభావం చూపనుంది. కోస్తాంధ్రులతో రాయలసీమవాసులు కలిసి జీవించవలసి వస్తే శ్రీబాగ్‌ ఒడంబడిక పూర్తిస్థాయిలో అమలుకు ఒత్తిడి తీసుకురావాలి. అది సాధ్యం కానప్పుడు పాత రాయలసీమ ప్రాంతంతోపాటు ఇతర భౌగోళిక సారూప్య ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటుకు సీమవాసులు,సీమఉద్యమసంస్థలు సీమ రాజకీయ పార్టీలు, నాయకులు నడుంకట్టి ఉద్యమించాలి.
-లెక్కల వెంకటరెడ్డి 
రాయలసీమ ఐక్య కార్యాచరణ సమితి ఉపాధ్యక్షుడు
Andhra Prabha daily (31-12-2013)

1 comment:

  1. బాగుంది.

    ఇప్పటిదాకా తెలంగాణావాదులు మిగిలిన తెలుగుప్రాంతం వారిపై నానా నిందలూ వేస్తూ విభజనకోరుతూ దాదాపుగా విజయం ముంగిలిదాకా వచ్చారు.

    ఇప్పుడు తెలంగాణా పోగా మిగిలిన ప్రాంతాలవాళ్ళం కూడా రకరకాల వైషమ్యాలు తవ్వుకుంటూ‌ తన్నుకుంటూ మరి రెండు చెక్కలుగా విడిపోవటానికి శాయశక్తులా ప్రయత్నిద్దాం.

    మరొక రెండేళ్ళకో, ఇరవై యేళ్ళకో అరవై యేళ్ళకో అప్పటి రాజకీయులు మళ్ళీ తలుచుకుంటే హాయిగా ముక్కలు చేసుకుందాం తప్పకుండా యీ నేలని.

    ఆ తర్వాత? జిల్లాలవారీగా ప్రత్యేకరాష్ట్రోద్యమాలు నడిపిద్దాం.

    చూద్దాం అప్పటీకి మనదేశాన్ని ఏ దేశపు దొరలు ఏలుతూ ఉంటారో, వాళ్ళ అవసరాలూ విధానాలూ ఎలా ఉంటాయే.

    తన్నుకు చావటంలో మాత్రమే మన తెలుగువాళ్ళం ప్రపంచంలో అందరికీ ఆదర్శం.

    ReplyDelete

వదరుఁబోతు కు వందేళ్లు...!

తెలుగు వ్యాసానికి తొలిదశలో ప్రమేయాలు, సంగ్రహం, ఉపన్యాసం తదితర పదాలు సమానార్థాలుగా కొనసాగాయి. రాజమండ్రిలో జిల్లా న్యాయమూర్తిగా ఉద్యోగ బ...